తెలంగాణలో విస్తరించిన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ సుమారు నెలరోజులుగా ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. నల్లమల అడవులు, కొండ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలను అడ్డుకోవాలంటూ కొద్దిరోజులుగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు తలపెట్టిన ఉద్యమానికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది.
గాలి కాలుష్యం, నీటి కాలుష్యం ప్రజలను వెంటాడుతున్నాయని విజయ్ దేవరకొండ చెప్పారు. రోజువారీ అవసరాల కోసం మంచినీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. మనం చేసిన మంచిపని ఏదైనా మిగిలి ఉందంటే అది నల్లమల అడవులను పరిరక్షించుకోవడమేనని, ఇప్పుడు దాన్ని కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం సరికాదని అన్నారు.
ఇలాంటి తవ్వకాలు బయో డైవర్సిటీని నాశనం చేస్తాయని, ఇప్పటికే నదులను, వాతావరణాన్ని కలుషితం చేశాం అని, అందుకే ఒక చోట అతివృష్టి, మరొక చోట అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయని ఆయన వేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపాలన్న ఆలోచన కేంద్రం విరమించుకోవాలని ఆయన పరోక్షంగా చెప్పడం జరిగింది.
ఇదే విషయం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా పోరాటం సాగిస్తున్నారు. సేవ్ నల్లమల పేరిట యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆయన గళం విప్పారు. ఈ విషయంలో ఆంధ్రా తెలంగాణా లోని అన్ని పార్టీలు కలసి రావాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆయనకు మద్దతుగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందించి పరోక్షంగా ఆయన ఉద్యమానికి మద్దతు పలికారు.