- 1973 నవంబర్ 1న కర్నాటకలోని మంగళూరులో పుట్టిన అందాల భామ
- అనుకోకుండా మోడల్ గా మారిన ఐశ్వర్యారాయ్ పలు సంస్థలకు మోడల్ గా వ్యవహరించింది
- తొలిసారే అమీర్ ఖాన్ తో కలిసి నటించే అవకాశాన్ని కొట్టేసిన మిస్ వరల్డ్
ఈరోజు నవంబర్ 1. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సం. అంతే కాదండోయ్ దివి నుండి భువికి దిగొచ్చిన ప్రపంచ సుందరి పుట్టిన రోజు. నీలి కళ్లతో కోట్లాది మంది అభిమానుల గుండెను కొల్లగొట్టిన ‘మిస్ వరల్డ్’ ఐశ్వర్య రా య జన్మించిన రోజు. 1973 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు కర్నాటక మంగుళూరులో జన్మించిన ఈ అందాల భామ పెరిగే కొద్దీ అందం అనే మాటకే సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రపంచ సుందరి. ర్యాంపుపై నడకతో, తన నీలికళ్లతో, సినిమాల్లో నటనతో ఎందరో అభిమానులను ఆకట్టుకున్న వయ్యారి భామ. తనదైన అభినయంతో కోట్లాది మంది కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టేసింది. ఈ రోజు సరిగ్గా 47వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఐశ్వర్యరాయ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు.
కర్నాటకలోని మంగుళూరులో తులు మాట్లాడే కుటుంబంలో కృష్ణరాజ్రాయ్, బృందారాయ్కు ఐశ్వర్యారాయ్ జన్మించింది. సోదరుడు ఆదిత్యరాయ్ మర్చెంట్నేవీలో ఇంజినీర్. చిన్నతనం నుంచి ఐశ్వర్య ముంబయిలోనే పెరిగింది. చదువుతూనే సంగీతం, సంప్రదాయ నృత్యాన్ని ఐదేళ్ల పాటు అభ్యసించింది. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే పెన్సిల్కు సంబంధించిన ఓ ప్రకటనలో ఐశ్వర్యారాయ్ నటించింది. చదువులో ఐశ్వర్య టాపర్. మాతుంగలోని ఆర్య విద్యామందిర్, జైహింద్ కాలేజ్, డి.జి.రూపరెల్ కళాశాలల్లో విద్యాభ్యాసం చేసిన ఐశ్వర్య వాస్తవానికి డాక్టర్ కావాలనుకొంది. మధ్యలో లక్ష్యం మార్చుకుని ఆర్కిటెక్చర్ కావాలని నిర్ణయించుకొంది. ఆ రంగంలో కొన్నాళ్లపాటు పార్ట్టైమ్ జాబ్ కూడా చేసింది. కానీ ఆమె ఏనాడూ ఊహించని విధంగా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది.
1991లో ఓ సంస్థ నిర్వహించిన సూపర్మోడల్ పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. నాటి నుండి పలు సంస్థలకు మోడల్గా వ్యవహరించింది. ఐశ్వర్యారాయ్ కథానాయిక కాక మునుపే ప్రముఖ కథానాయిక రేఖ గుర్తుపట్టి పలకరించింది. ప్రకటనల్లో చాలా అందంగా కనిపిస్తున్నావని భుజం తట్టి ప్రోత్సహించిందట. 1993లో ఆమిర్ఖాన్తో కలిసి ఓ ప్రకటనలో నటించిన ఐశ్వర్య ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 1994లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఐశ్వర్య అందులో రన్నరప్గా నిలిచింది. బాలీవుడ్ నటి సుస్మితాసేన్ నాటి పోటీల్లో విజేతగా నిలిచింది. తర్వాత ఏడాది (1995)లో దక్షిణాఫ్రికాలో జరిగిన మిస్ వరల్డ్ (ప్రపంచ సుందరి) పోటీల్లో పాల్గొని టైటిల్ గెలుచుకుంది.
మణిరత్నం తమిళంలో తీసిన ‘ఇరువర్’తో తెరంగేట్రం చేసిన ఐశ్వర్యరాయ్ ఆ చిత్రం తెలుగులో ‘ఇద్దరు’గా విడుదలైన సంగతి తెలిసిందే. అందులో ఐశ్వర్యారాయ్ పుష్పవల్లి, కల్పన పేర్లతో ద్విపాత్రాభినయం చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా అదే ఏడాది ‘ఔర్ప్యార్ హో గయా’ చిత్రంతో హిందీ తెరకు పరిచయమైంది. అయితే ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. 1998లో శంకర్ తీసిన ‘జీన్స్’లో అవకాశాన్ని అందుకున్న అందాల భామ మధుమిత పాత్రలో చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. హిందీలో ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ తర్వాత ఐష్కు అభిమానులు భారీగా పెరిగారు. ఆ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత ‘తాల్’,’హమ్ కిసీ సే కమ్ నహీ’ లాంటి సినిమాల్లో నటించి అలరించింది. ఆమెకు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు రావడానికి ‘దేవదాస్’ ఓ కారణం. అందులో పారూ పాత్రలో మైమరపించింది. కేన్స్ చలన చిత్రోత్సవంలో ఆ సినిమా ప్రదర్శితమైంది. ఆ తర్వాత ఐశ్వర్యారాయ్కు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో అవకాశాలు కూడా లభించాయి. హాలీవుడ్లో ‘బ్రైడ్ అండ్ ప్రెజిడ్యూస్’, ‘మిసెస్ ఆఫ్ స్పైసెస్’,’ప్రొవోక్డ్, ‘ది లాస్ట్ లెజియన్’ చిత్రాల్లో నటించింది. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడుదొడుకులనూ ఎదుర్కొంది ఐష్. 1999లో సల్మాన్ఖాన్తో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి డేటింగ్ చేశారని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే వీరి బంధం ఎంతో కాలం సాగలేదు. 2001లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వివేక్ ఒబెరాయ్తో ఈమె ప్రేమలో పడినట్టు వార్తలొచ్చాయి.
అభిషేక్ తో సినిమా, పెళ్లి అభిషేక్ బచ్చన్తో కలిసి ‘ధూమ్2’లో నటిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. 2007 జనవరి 14న ఐష్-అభిషేక్ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు అమితాబ్ బచ్చన్ ధ్రువీకరించారు. అదే ఏడాది ఏప్రిల్ 16న అమితాబ్ బచ్చన్ సొంతిల్లు ప్రతీక్షలో పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య అంగరంగ వైభవంగా అభిషేక్-ఐష్ వివాహం జరిగింది. 2011 నవంబరు 16న ఈమె ఓ పాపకు జన్మనిచ్చింది. నాలుగు నెలల తర్వాత ఆ చిన్నారికి ‘ఆరాధ్య’ అని పేరు పెట్టారు. పెళ్లయిన తర్వాత చాలా తక్కువ చిత్రాల్లో నటించింది. వాటిల్లో ‘సర్బజిత్’, ‘ఏ దిల్ ముష్కిల్ హై’, ‘ఫన్నేఖాన్’. అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటనల్లో మెరుస్తుంది. ఐశ్వర్యారాయ్ గర్భవతి అని తెలిసిన సమయంలో బాలీవుడ్లో ఓ వివాదం సాగింది. అప్పటికే ఆమె ‘హీరోయిన్’ అనే సినిమాలో నటించేందుకు సంతకం చేసింది. చిత్రం సెట్స్పైకి వెళ్లే సమయంలో ఐశ్వర్య ప్రాజెక్టు నుంచి బయటికొచ్చింది. ఆమె ఐదు నెలల గర్భవతినని చెప్పడం వల్ల నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గర్భవతి అన్న విషయాన్ని ఐష్ దాచిపెట్టిందని, సినిమా ఆలస్యానికి కారణమైందని వాళ్లు ఆరోపించారు.కేన్స్ చలన చిత్రోత్సవం అవార్డుల జ్యూరీ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన తొలి భారతీయ నటి ఐశ్వర్యారాయ్.