కడప శివారులోని విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం అయ్యారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి అక్రమ మార్గంలో ఎర్రచందనం తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. కడప శివారు గోటూరు వద్ద స్మగ్లర్లకు చెందిన రెండు కార్లు టిప్పర్ను ఢీకొన్నాయి. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య టిప్పర్ రోడ్డు మలుపు తిరుగుతుండగా ప్రమాదం జరిగింది. మొదటి కారు ఢీకొన్న క్షణాల్లోనే.. వెనుక వస్తున్న స్కార్పియో వాహనం టిప్పర్ డీజిల్ ట్యాంక్ని ఢీకొట్టింది.
మంటలు చెలరేగి ఎర్రచందనం ఉన్న రెండో కారులో (స్కార్పియో)నలుగురు సజీవ దహనమయ్యారు. మొదటి కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు గాయపడగా వారిని రిమ్స్ కు తరలించారు. స్మగ్లర్లు కడప వైపు నుంచి తాడిపత్రి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారడంతో… వారి వివరాలను తెలుసు కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారంతా తమిళనాడు వాసులుగా పోలీసులు భావిస్తున్నారు.
