అమరావతిలో భూసేకరణతో సహా మునుపటి టిడిపి ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులలో అవకతవకలు జరిగాయని సిట్ దర్యాప్తుకు ఆదేశించిన జగన్ ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించిన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పు ను సవాల్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో చేసిన దాఖలు పై విచారణ జరిపిన కోర్టు, ఈరోజు నోటీసులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. సీఆర్డీయే ప్రాంతంలోని భూముల అంశంలో అవకతవకలు జరిగాయని కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందని సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. సబ్ కమిటీ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందన్నారు. దర్యాప్తు ప్రాథమిక దశలోనే హైకోర్టు స్టే ఇవ్వడం సరికాదని దుష్యంత్ దవే వాదించారు.
గత ప్రభుత్వ అన్ని చర్యలపై దర్యాప్తు చేయాలని కమిటీని ఏర్పాటు చేశారా అని జస్టిస్ అశోక్ భూషణ్ ప్రశ్నించారు. అవకతవకలు జరిగాయని కమిటీ భావించిన అంశాలపైనే సిట్ ఏర్పాటు చేసినట్లు దుష్యంత్ దవే కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ సహా సిట్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిందా వేసింది.