దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై గతంలో లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన రాజా రమణి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆర్సీ పురం పోలీసులు ఆమెకు పటాన్చెరులోని ఓ ఆస్పత్రిలో రహస్యంగా చికిత్స చేయించి ఇంటికి తరలించినట్టు సమాచారం.
ఆమె గతంలో న్యాయవాది అయిన రఘునందన్ను ఒక కేసు విషయమై ఆశ్రయించగా, కాఫీలో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేశాడంటూ రాజా రమణి ఆరోపించారు.
కేసుల పరిష్కారం కోసం వచ్చే మహిళల్ని రఘునందన్ భయపెట్టి లొంగదీసుకుంటాడని రాజా రమణి సంచలన ఆరోపణలు చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అంటే కాకుండా రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆమె ఆశ్రయించారు.
ఇప్పుడు రఘునందన్ రావుతో పాటు పలువురు పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని, అత్యాచారం కేసులో న్యాయం చేయాలని 20 ఏళ్లుగా తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదని సెల్ఫీ వీడియో పోస్ట్ చేసారు.
న్యాయం జరగకపోగా వేధింపులకు గురిచేస్తున్న అధికారులు, ఎమ్మెల్యే రఘునందన్, ఆర్సీ పురం పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. న్యాయం జరగడం లేదనే ఆవేదన, నిరసనతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చెప్పారు.