826.17 కోట్ల రూపాయల బ్యాంకు ఫ్రాడ్ కేసులో వైఎస్ఆర్సిపి రెబల్ ఎంపి కనుమురు రఘు రామ కృష్ణరాజు, అతని భార్య, మరో 9 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసింది.
ఇండ్ -భారత్ పవర్ ప్లాంట్ కోసం తీసుకున్న రుణాన్ని పక్క దారి పట్టించినందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చిన కంప్లైంట్ మీద సిబిఐ దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం
అక్టోబర్ 7 న ముంబై, హైదరాబాద్ లోని 11 ప్రదేశాలలో, అంతే కాకుండా ఆ కంపెనీ సికింద్రాబాద్లోని ప్రధాన కార్యాలయంపై కూడా సిబిఐ అధికారులు దాడి చేసారు .
సిబిఐ వివరాల ప్రకారం, ఇందు భారత్ కంపెనీ , తమ డైరెక్టర్ల ద్వారా పలు కార్పొరేట్ బ్యాంకులను ఆర్థిక సహాయం కోసం సంప్రదించింది . ఇందులో భాగంగా కర్ణాటకలోని హోంకన్ గ్రామంలో 300 మెగావాట్ల బొగ్గు ఆధారిత గ్రూప్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి కంపెనీకి అనుకూలంగా రూ .941.80 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు.
అయితే , పర్యావరణ అనుమతి లేనందున ఈ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. కాబట్టి దీనిని తమిళనాడుకు మార్చారు.
అయితే రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఈ కంపెనీ డైరెక్టర్ల అకౌంట్లలో అవకతవకలు జరిగాయని గుర్తించి , వారిని సంప్రదించిన కూడా ఎటువంటి బదులు రాలేదని తెలిపారు.
2014-15, 2015-16 లో కంపెనీ 14,70,861 మెట్రిక్ టన్నుల బొగ్గును రూ .516.20 కోట్లకు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. 31 సరుకుల ద్వారా కొనుగోలు జరిగింది.
అయితే 2019 లో ఒక ఇండిపెండెంట్ ఫోరెన్సిక్ ఆడిట్ ఈ కంపెనీ లావా దేవీల్లో పెద్ద ఎత్తున మోసం జరిగిందని గుర్తించింది .
ఈ సంస్థ “2019 లో థర్మల్ పవర్ ప్లాంట్ను సందర్శించినప్పుడు, ప్లాంట్ వద్ద కొనుగోలు చేసిన బొగ్గు కనిపించలేదని మరియు 16000 మెట్రిక్ టన్నుల ఫ్లై యాష్ లాగా ఉన్న కొద్దిపాటి పదార్థాలు మాత్రమే ఉన్నాయి అని తేల్చింది. తమిళనాడులోని కార్యాలయంలో కొనుగోలు రశీదు కనుగొనబడలేదు. అయితే బొగ్గును చెదపురుగులు నాశనం చేశాయని యాజమాన్యం వివరించింది ” అని సిబిఐ తెలిపింది.
516.20 కోట్లకు కంపెనీ బొగ్గును కొనుగోలు చేసినట్లు పరిశోధకులు కనుగొన్నారు. అందులో రూ .187.39 కోట్ల విలువైన 5,26,846 మెట్రిక్ టన్నుల బొగ్గును ఓడరేవు నుంచి ఫ్యాక్టరీ ప్రాంగణానికి రవాణా చేయలేదు. బదులుగా, దీనిని ప్లాంట్ సమీపంలో ఉన్న IND- భారత్ పవర్ జెన్కామ్ లిమిటెడ్కు తీసుకెళ్లారు.
కంపెనీ రికార్డుల్లో అనుమానాలు ఉన్నాయని , అంతే కాకుండా ఈ కంపెనీ బొగ్గు కొనుగోలు విషయంలో కూడా ఎక్కడ కూడా రికార్డుల్లో ఉన్నదానికి పొంతన లేదని తెలిపింది. 243 కోట్ల బొగ్గు కొనుగోలు విషయంలో అనుమానం ఉందని తెలిపింది .
చివరగా సిబిఐ ఈ కంపెనీ బ్యాంకులను లోన్ల పేరుతొ చీట్ చేసి ఫ్రాడ్ చేసిందని , లోన్ గా తీసుకున్న డబ్బులను వివిధ రకాలుగా డైవర్ట్ చేసారని , ఇందులో మొత్తం 826 కోట్ల వరకు ఫ్రాడ్ జరిగిందని తేల్చింది .
భారతీయ శిక్షాస్మృతిలోని 120-బి, 420 కింద ఐఎన్డి-భారత్ డైరెక్టర్లు – కనుమరు రాజు రఘు రామ కృష్ణ, ఆయన భార్య కె రామదేవి, కోటగిరి ఇందిరా ప్రియదర్శినిపై కేసు నమోదైంది. అదనపు డైరెక్టర్లు – గోపాలన్ మనోహన్, బొప్పన సౌజన్య, మరియు నారాయణ ప్రసాద్ భాగవతుల, మేనేజింగ్ డైరెక్టర్ సీతారామం కొమరగిరి మరియు మరో నలుగురిపై కూడా కేసు నమోదు చేశారు.
ఢిల్లీ పర్యటన సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి) అధికారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన కొన్ని రోజుల తరువాత ఈ కేసు బుక్ అవ్వడం ఇప్పుడు రాజకీయ రచ్చకు దారి తీసింది .